న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల సమావేశాల్లో డేటా ప్రొటెక్షన్ బిల్లు(Data Protection Bill)ను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి(Attorney General R Venkataramani) తెలిపారు. సుప్రీంకోర్టుతో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డేటా ప్రొటెక్షన్ బిల్లు సిద్ధంగా ఉందని, ఆ బిల్లును కేవలం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడుతామన్నారు. వాట్సాప్ ప్రైవేటు పాలసీ గురించి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సమయంలో అటార్నీ జనరల్ ఈ విషయాన్ని చెప్పారు. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆ కేసును విచారిస్తున్నది.
వ్యక్తిగత డేటా రక్షణ గురించి డేటా ప్రొటెక్షన్ బిల్లులో పూర్తిగా పొందుపరిచామని అటార్నీ జనరల్ కోర్టుకు చెప్పారు. అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ ఉన్నారు. వాట్సాప్ ప్రైవేటు పాలసీ పిటిషనర్ తరపున అడ్వకేట్ శ్యామ్ దివన్ వాదనలు వినిపించారు. డేటా ప్రొటెక్షన్ కోసం ఇండియాలో ప్రత్యేకమైన చట్టంలేదు. ప్రస్తుతం ఐటీ యాక్టు 2000 ప్రకారం డేటా రక్షణను రెగ్యులేట్ చేస్తున్నారు.