ఇస్లామాబాద్ : భారత్తో దౌత్యపరంగా, ఆర్థిక సంబంధాలు కొనసాగించే రోజు వస్తుందని ఆశిస్తున్నానని.. ఇవాళ కాకపోతే రేపైనా ఆ రోజు రావాల్సిందేనని, పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం సందర్భంగా దావోస్లో పాత్ఫైండర్ గ్రూప్, మార్టిన్ డౌ గ్రూప్ నిర్వహించిన సెషన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాక్కు పొరుగున ఉన్న సంఘర్షణలపై స్పందిస్తూ.. ‘నా జీవితంలో ప్రాంతీయ విభేదాలను పరిష్కరించుకోగలిగే రోజు వస్తుందని నేను ఆశిస్తున్నా. అయితే, పాక్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడదు’ అని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. కశ్మీర్ సమస్యను ‘గదిలో ఏనుగు’గా పాక్ మంత్రి హీనా రబ్బానీ ఖర్, దాన్ని పక్కనపెట్టలేమన్నారు. ‘70 ఏళ్లనాటి వివాదం’ పరిష్కరించకుండా దక్షిణాసియాను ఏకీకృతం చేయడానికి, వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు చేసే ఏ ప్రయత్నమైనా పనికిరాదన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ‘దక్షిణాసియాపై వ్యూహాత్మక విధానం’ అనే అంశంపై జరిగిన సెషన్లో పాక్ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్, పాక్ మధ్య సంబంధాలను పెంపొందించుకోవాలని, విభేదాలను పక్కనపెట్టి సరిహద్దుల్లో ప్రజల రాకపోకలను సులభతరం చేసేందుకు చేసిన సూచనలకు ప్రతిస్పందనగా మంత్రి ఈ ప్రకటన చేశారు.