చండీఘడ్: శిరోమణి అకాళీదల్ నేత, పంజాబ్ మాజీ మంత్రి బిక్రం సింగ్ మజితియా(Bikram Singh Majithia) ఇవాళ నాభా జైలు నుంచి బయటకు వచ్చారు. అక్రమాస్తులు కలిగి ఉన్న కేసులో సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. న్యాయపరమైన ప్రక్రియ వల్ల మతిజియా రిలీజై ఆలస్యమైంది. ఆయనకు స్వాగతం పలికేందుకు భార్యతో సహా పార్టీ వర్కర్లు జైలు వద్దకు వెళ్లారు. జైలు నుంచి బయటకు రాగానే మజితియా తన సహజరీతిలో మీసాలను మెలేశారు. ఓపెన్ టాప్ జీప్లో తన మద్దతుదారులతో కలిసి వెళ్లారు.
దాదాపు రూ.700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నారని శిరోమణి అకాళీదల్ నేత బిక్రం సింగ్ మజితియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం బెయిల్పై ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలు, విచారణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది.
అక్రమాస్తుల కేసుకు సంబంధించి బిక్రం సింగ్పై సిట్ 2025 జూన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వెంటనే అతడిని అమృత్ సర్లోని తన ఇంటి నుంచి పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (వీబీ)కి చెందిన పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు న్యూ నభా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దీంతో బిక్రం సింగ్.. పంజాబ్, హరియాణా హైకోర్టులో గతంలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. తర్వాత అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఈ కేసులో గత ఆగష్టులోనే పోలీసులు సప్లిమెంటరీ ఫైల్స్తోకలిపి 40,000 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. పంజాబ్కు చెందిన మజితియా శిరోమణి అకాళిదల్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. ఈ సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలొచ్చాయి. 2007-2017 మధ్య కాలంలో ఆయన, అతడి భార్య కలిపి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో పంజాబ్ విజిలెన్స్ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.