న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar).. ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో హిందీ భాషలో నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేడీయూ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత జయరాం రమేశ్, బీజేపీ ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూఢీ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన నేపథ్యంలో.. ఇక బీహార్లో ఆయన ప్రస్థానం ముగిసినట్లు చెబుతున్నారు.ఏప్రిల్ 14వ తేదీన ఎన్డీఏ కూటమి .. బీహార్ కొత్త సీఎంను ఎన్నుకోనున్నది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పదవి వరించే అవకాశం ఉన్నదని జోరుగా ప్రచారం జరుగుతున్నది.