పాట్నా, ఆగస్టు 8: బీహార్లో అధికార జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి బీటలువారే సూచనలు కనిపిస్తున్నాయి. కమలదళంతో సీఎం నితీశ్ కుమార్ ఏ క్షణంలోనైనా తెగదెంపులు చేసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ సొంత పార్టీతో కంటే బీజేపీతో సత్సంబంధాలు నెరపడం, ఆయన్ని నితీశ్ టార్గెట్ చేయడం, అనంతరం సింగ్ రాజీనామాతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీని వీడితే మద్దతు ప్రకటిస్తామని ఆర్జేడీ, వామపక్షాలు వెల్లడించడం.. నితీశ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్ చేశారనే వార్తలు వెరసి బీహార్ రాజకీయాలను రసకందాయంలో పడేలా చేశాయి. ఈ క్రమంలో బుధవారం జేడీయూ, ఆర్జేడీ తమ ఎంపీలు, ఎమ్మెల్యేలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించడం కీలకంగా మారింది.
కుట్ర భగ్నానికి బీజం వేశారిలా..
బీజేపీ, జేడీయూ మధ్య గత కొద్దికాలంగా సఖ్యత లేదు. వాటిని నిజం చేసేలా జూలై 17 నుంచి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన నాలుగు కీలక సమావేశాలకు నితీశ్ హాజరుకాలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఏక్నాథ్ షిండేను పావుగా వాడుకొంటూ శివసేనలో చీలకను తీసుకొచ్చి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయడంపై నితీశ్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇదే ఫార్ములాను బీజేపీ.. బీహార్లో కూడా అమలుచేయవచ్చని నితీశ్ సన్నిహితులు ఆయన్ని ముందుగానే హెచ్చరించారు. ఇందుకు అనుగుణంగానే జేడీయూలో కీలక నేతగా ఉన్న ఆర్సీపీ సింగ్ సొంతపార్టీతో కంటే బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని నితీశ్ గ్రహించారు. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సింగ్ను ఆ పదవి నుంచి తొలగించాలని నితీశ్ చేసిన డిమాండ్ను రాష్ట్ర బీజేపీ నాయకులు పరిగణనలోకి తీసుకోకపోవడం ఆయన్ని కలిచివేసింది. ఇటీవలి బీహార్ పర్యటనలో.. ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని, బీజేపీ ఒక్కటే పెద్ద పార్టీగా మిగిలిఉంటుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడం నితీశ్ను ఆలోచనలో పడేసింది. దీంతో పార్టీకి నష్టం చేకూరుస్తున్న ఆర్సీపీ సింగ్కు చెక్ పెట్టాలని ఆయన భావించారు. ఇందులోభాగంగా.. సింగ్ను మూడోసారి రాజ్యసభకు నామినేట్ చేయడానికి నిరాకరించారు. దీంతో ఆయన కేంద్ర క్యాబినెట్ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం.. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సింగ్ను ఆదేశించారు. ముప్పేట దాడి పెరిగిపోవడంతో సింగ్ శనివారం జేడీయూని వీడారు. ఈ క్రమంలో కమలదళం ప్లాన్-బీని అమలు చేయవచ్చని సన్నిహితుల ద్వారా తెలుసుకున్న నితీశ్.. మంగళవారం అత్యవసర పార్టీ మీటింగ్కు పిలుపునిచ్చారు.
పార్టీ అత్యవసర సమావేశం
జేడీయూలో చీలికకు బీజేపీ కుట్రకు తెరతీసిందని పసిగట్టిన నితీశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పార్టీ అంతర్గత సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ భేటీకి జేడీయూకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవ్వాలని సూచించారు. కొత్త పొత్తులపై ముఖ్య నేతలతో సంప్రదించి నితీశ్ ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. నితీశ్ నిర్ణయానికి పార్టీ నేతలందరూ కట్టుబడి ఉంటారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు.
11లోగా సంకీర్ణ సర్కారుకు రాంరాం?!
ఆగస్టు 11లోగా కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, జేడీయూకి చెందిన ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సముఖంగా లేరు. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని నితీశ్ అధికారాన్ని కాపాడుకుంటారని అంచనా వేస్తున్నారు.
కొత్త పొత్తు దిశగా అడుగులు
రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆదివారం రాత్రి నితీశ్ సోనియాగాంధీతో ఫోన్లో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వాళ్లు చర్చించుకున్నట్టు సమాచారం. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్తో కూడా శని, ఆదివారాలు నితీశ్ ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలందరూ పాట్నా చేరుకోవాలని తేజస్వీ పిలుపునిచ్చినట్టు చెబుతున్నారు. ఒకవైపు మంగళవారం ఉదయం 11 గంటలకు జేడీయూ సమావేశం ఉండగా.. అదేరోజు ఉదయం 9 గంటలకు ఆర్జేడీ తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. నితీశ్ బీజేపీని వీడినట్లయితే ఆయన పార్టీతో కలవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆర్జేడీ, వామపక్షాలు సోమవారం ప్రకటించాయి. జేడీయూతో జట్టుకు సుముఖంగానే ఉన్నట్టు కాంగ్రెస్ కూడా ప్రకటించింది.
తాను మరో ఉద్ధవ్లా కాకుండా..
ఏక్నాథ్ షిండేను పావుగా వాడుకొంటూ శివసేనలో చీలకను తీసుకొచ్చి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయడం తెలిసిందే. ఇదే ఫార్ములాను బీహార్లో అమలు చేసి.. తనను ఉద్ధవ్ ఠాక్రేలా చేయడానికి బీజేపీ కుట్రకు తెరతీయవచ్చని నితీశ్ను సన్నిహితులు హెచ్చరించారు. దీంతో ఆయన బీజేపీతో తెగదెంపుల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
షా పెత్తనమూ కారణమే..
బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో అమిత్ షా పెత్తనం అంతకంతకూ పెరిగిపోతుండటం కూడా నితీశ్ తాజా నిర్ణయానికి మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.