న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రచారం ఊపందుకున్న క్రమంలో జేడీ(యూ)కు కేబినెట్లో చోటు కల్పించడంపై ప్రధాని నరేంద్ర మోదీతో బిహార్ సీఎం నితీష్ కుమార్ మంగళవారం సమావేశమయ్యారు. సీఎం టూర్ కేవలం ప్రైవేట్ పర్యటన అని జేడీయూ వర్గాలు చెబుతుండగా ప్రధానితో నితీష్ భేటీకి కేబినెట్ విస్తరణే ప్రధాన అజెండా అని భావిస్తున్నారు. మోదీతో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కూడా బిహార్ సీఎం సమావేశమవనున్నారు.
మోదీ రెండవసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన అనంతరం ఇప్పటివరకూ కేంద్ర కేబినెట్కు దూరంగా ఉన్న జేడీయూ.. బీజేపీ ప్రధాన భాగస్వామిగా తమకు కేబినెట్లో కీలక శాఖలు కట్టబెట్టాలని కోరుతోంది. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షమైన జేడీయూ కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేపట్టినా అందులో భాగమవుతుందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ పేర్కొన్నారు. బిహార్ లో బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్న జేడీయూకు లోక్సభలో16 మంది ఎంపీలుండగా కేబినెట్లో మాత్రం బెర్త్ దక్కలేదు.