పాకిస్తాన్ ఆర్థికంగా బాగా చితికిపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే స్థితిలో లేదని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలపై సంచలన ఆరోపణలు చేశారు. భుట్టో, షరీఫ్ కుటుంబాలు దేశాన్ని దోచుకున్నాయని, వారి వల్లే దేశానికి ఈ పరిస్థితి తలెత్తిందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ రెండు కుటుంబాలు అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని బాగా ప్రోత్సహించాయని, దేశాన్ని సర్వనాశనం చేశాయని ఆరోపించారు. పాకిస్తాన్కు చెందిన అల్జహీరా న్యూస్ చానల్ ఇమ్రాన్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలోనే ఇమ్రాన్ విపక్షాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్లో వనరులకు ఎలాంటి లోటూ లేదని, అయితే ఈ రెండు కుటుంబాలు ఆ వనరులను దుర్వినియోగం చేశాయని ఆయన పేర్కొన్నారు.
భుట్టో, షరీఫ్కు చెందిన పార్టీలు అవి రాజకీయ పార్టీలు కావని, కేవలం వంశాకురాలని, వారి వల్లే దేశానికి ఈ గతి పట్టిందని దుయ్యట్టారు. అవినీతికి పాల్పడటం అనేది పెద్వ జాఢ్యమని, సంపన్న కుటుంబాలు తమ దేశ ప్రజలనే పేద ప్రజలుగా ఉంచుతూ, వనరులను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ను సమృద్ధమైన దేశంగా తీర్చిదిద్దాలన్న బలమైన సంకల్పంతోనే ముందుకు సాగుతున్నామని ఇమ్రాన్ ప్రకటించారు. పాక్లోని రెండు ధనవంతమైన కుటుంబాలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని ఇమ్రాన్ పేర్కొన్నారు.