Power looms | ముంబై, అక్టోబర్31(నమస్తే తెలంగాణ): తయారైన బట్టకు సరైన ధర రాక, ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలో భీవండీ పట్టణంలోని పవర్లూమ్ యాజమాన్య సంఘాలు బుధవారం నుంచి 20 రోజులపాటు మరమగ్గాల పరిశ్రమలను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. భీవండి పట్టణంలోని 40 సంఘాలకు చెందిన 700 మంది మరమగ్గాల పరిశ్రమల యజమానులు అక్కడి హాలారి విశా హాలులో మంగళవారం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో అనేక విషయాలపై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ ప్రతినిధి నరేశ్ సంచేటి వెల్లడించారు. వచ్చే దీపావళి పండుగకు ఎటువంటి బట్టకు డిమాండ్ లేకపోవడం, చైనా నుంచి వస్త్రం దిగుమతి కావడం పరిశ్రమ మూసివేతకు మరో ముఖ్య కారణాలుగా శాంతినగర్ పవర్లూమ్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నన్ సిద్ధిఖీ తెలిపారు. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లభించకపోతే, మళ్లీ మునుపటి లాగే మరమగ్గాలను తుకుగా మార్చి, కిలోల చొప్పున అమ్ముకోవాల్సి వస్తుందని సిద్ధిఖీ ఆందోళన వ్యక్తం చేశారు.
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన భీవండీలో దాదాపు 15 లక్షల మరమగ్గాలు ఉన్నాయి. 5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 5 లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో 17 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 25 శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నది. దాంతో వస్త్ర పరిశ్రమ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు తరలిపోతున్నది.