ముంబై : భీమా కోరెగావ్ హింసాకాండ కేసులో నిందుతుడు గౌతమ్ నవ్లాఖాకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయనను తలోజా జైలు నుంచి విడుదల చేసి గృహనిర్బంధంలో ఉంచేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు పలు షరతులను విధించింది. గౌతమ్ నవ్లాఖా తన జీవిత భాగస్వామితో కలిసి జీవించేందుకు అనుమతి ఇచ్చింది. నవ్లాఖాకు పోలీసులు అధికారులు మొబైల్ను అందిస్తారని, దీంతో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడొచ్చని.. అదే సమయంలో ఫోన్ కాల్ను పరిశీలించేందుకు, రికార్డు ఉంచేందుకు పోలీసులకు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్లతో కూడిన ధర్మాసనం అధికారం ఇచ్చింది.
గౌతమ్ నవ్లాఖా నెల రోజుల పాటు నవీ ముంబైలోని గృహనిర్బంధంలో ఉండనుండగా.. నెలరోజుల అనంతరం ఈ ఆదేశాలను సమీక్షిస్తామని కోర్టు పేర్కొంది. నిర్బంధ సమయంలో ఆయన ఎలాంటి కమ్యూనికేషన్ పరికరాలు అంటే.. లాప్టాప్, మొబైల్, కంప్యూటర్ను వినియోగించడానికి వీల్లేదని, అలాగే మీడియాతోనూ, కేసుకు సంబంధించిన వ్యక్తులు, సాక్షులతోనూ మాట్లాడొద్దని చెప్పింది. మరో వైపు తనిఖీలను దుర్వినియోగం చేయకూడదని, పిటిషనర్ను వేధించే ఎత్తుగడగా వినియోగించకూడదని కోర్టు పోలీసులకు సూచించింది. భీమా కొరెగావ్ కేసులో గౌతమ్ నవ్లఖాని 2018లో పోలీసులు అరెస్ట్ చేయగా.. 2020లో ముంబయిలోని తలోజా జైలుకి తరలించారు. అప్పటి నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు.