చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు ఆమ్ ఆద్మీ నేత భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రతాను శనివారం తొలగించారు. మన్ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, రజియా సుల్తానా, పర్గత్ సింగ్, రాణా గుర్జీత్ సింగ్, సుఖ్బిందర్ సింగ్ సర్కారియా, సంజయ్ తల్వార్, నాథూ రామ్, దర్శన్ లాల్, ధరంబీర్ అగ్నిహోత్రి, అరుణ్ నారంగ్, తర్లోచన్ తదితర నేతల సెక్యూరిటీని వెనక్కి పిలిచారు.
కాగా, భగవంత్ మాన్ వేణు ప్రసాద్ను ప్రిన్సిపాల్ సెక్రెటరీగా నియమించారు. ఆయన 1991 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భగవంత్ మాన్ పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ను శనివారం కలిశారు. శుక్రవారం మొహాలీలో జరిగిన ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో మాన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆప్ పంజాబ్ ఇన్చార్జి రాఘవ్ చద్దా మాన్తో కలిసి గవర్నర్ను కలిశారు. అనంతరం ఎమ్మెల్యేల మద్దతను లేఖను అందించామన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వాలని కోరామని.. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే వేదిక గురించి సమాచారం ఇచ్చామన్నారు. భగవంత్ మాన్ స్వగ్రామంలో ఈ నెల 16న మధ్యాహ్నం 12.30 గంటలకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. హర్పాల్ సింగ్ చీమా, అమన్ అరోరా, బల్జీందర్ కౌర్, సరవ్జిత్ కౌర్ మనుకే, గుర్మీత్ సింగ్ మీత్ హయర్, బుధ్ రామ్, కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, జీవన్జ్యోత్ కౌర్, డాక్టర్ చరణ్జిత్ సింగ్లతో సహా పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.