Punjab Elections | పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో భగవంత్ మాన్ స్పందించారు. తానెప్పుడూ ఓ సైనికుడినేనని, ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని పునరుద్ఘాటించారు. పంజాబ్ పునర్వైభవం కోసం కష్టపడుతూనే వుంటానని స్పష్టం చేశారు. నేనెప్పుడూ సైనికుడినే. ఇదే విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటా. పంజాబ్ సీఎం వున్నంత వరకూ పోస్టర్ బాయ్గానే ఉంటా అని ప్రకటించారు.
కమెడియన్గా ఉన్న సమయంలో ప్రజలందరూ తనను చూసి నవ్వేవారని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు తనపై ఓ నమ్మకం పెట్టుకున్నారని అన్నారు. ప్రజలను కాపాడడానికి పైన భగవంతుడు ఉన్నాడని, తానెప్పుడూ ఓ మాధ్యమంగానే పనిచేస్తానని భగవంత్ పేర్కొన్నారు. పంజాబ్ కీర్తి కోసం కలలు కంటూనే వుంటానని, ఈ కలలు తనను ఏమాత్రం నిద్రపోనివ్వవని భగవంత్ మాన్ స్పష్టం చేశారు.
పంజాబ్ సీఎం అభ్యర్థిని ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ను సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని, ఇందు కోసం తాము ఓ నెంబర్ను ప్రకటిస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలు సీఎం అభ్యర్థిని సూచించవచ్చన్నారు. ఈ ఫీడ్బ్యాక్లో 19 లక్షల మంది పాల్గొన్నారు. ఇందులో 90 శాతం ప్రజలు భగవంత్ మాన్ వైపే మొగ్గు చూపారు. దీంతో సీఎం కేజ్రీవాల్ ఎంపీ భగవంత్ మాన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.
పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికైనందుకు భగవంత్ మాన్కు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పంజాబ్ మొత్తం ఆప్ వైపే ఆశగా ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల మొహాల్లో చిరు నవ్వులు తీసుకురావడానికి భగవంత్ కృషి చేస్తారన్న నమ్మకం తమకుందని కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.