బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు నెలల కిందట ప్రారంభించిన సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. దీంతో ‘40 శాతం’ కమీషన్ అంటూ ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తూర్పు శివారు ప్రాంతాలను ఐటీ హబ్లోని ఇతర ప్రాంతాలకు కలిపేందుకు కుందనహళ్లి అండర్పాస్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా వేసిన సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయి గోతులమయంగా మారింది.
అయితే బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ సీఎం బొమ్మై సర్కార్పై కాంగ్రెస్ నాయకుడు నాగరాజు యాదవ్ మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్తోపాటు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరు నగరానికి ప్రత్యేక మంత్రి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. బెంగళూరు ఇంచార్జీ అయిన సీఎం బసవరాజ్ బొమ్మై ఆ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
మరోవైపు పైప్ లైన్ పగలడం వల్ల గత కొన్ని రోజులుగా నీరు చేరి రోడ్డు కుంగిందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు పగిలిన పైప్లైన్ను సరిచేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కుంగిన రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపడతామని వివరించారు. ఏడాదిపాటు రోడ్డు నిర్వాహణకు బాధ్యత వహించే కాంట్రాక్టర్ ఉచితంగానే ఈ పనులు చేస్తారని వెల్లడించారు.