కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర అల్లర్లలో 21 మంది మరణించారని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పాలక టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీ మద్దతుదారులు, సభ్యులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన స్ధానాల్లో దాదాపు సగం నియోజకవర్గాల్లో హింసాకాండ ప్రజ్వరిల్లిందని చెప్పారు.
హోంమంత్రిత్వ శాఖ నిజనిర్ధారణ టీం ప్రతినిధులను తాము కలిశామని, అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కోరామని తెలిపారు. మరోవైపు బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యాయత్నాలు పెచ్చుమీరాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. కేంద్ర మంత్రి కాన్వాయ్ పైనే దాడి జరగడం బెంగాల్ పరిస్ధితికి అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారని నడ్డా అన్నారు.