చెన్నై, ఆగస్టు 16: బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు అత్యుత్సాహం చూపుతున్నదని ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని, బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్న కార్పొరేట్ సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేయాలని తాజాగా చెన్నైలో జరిగిన బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ) సదస్సు డిమాండ్ చేసింది. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చర్చించారు.
బీఈఎఫ్ఐ నేత దేబాశిష్ బసు చౌదురి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. 2008లో ఆర్థిక మాంద్యం నుంచి బ్యాంకులు కాపాడాయంటే.. అందుకు అవి ప్రభుత్వ రంగంలో ఉండటమే కారణమని, ఇదే సమయంలో అమెరికాలో ప్రైవేటు రంగంలో ఉన్న సిలికాన్ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ వంటి బ్యాంకులు దివాలా తీశాయన్న విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సహకార బ్యాంకులను కూడా కేంద్రం వాణిజ్యీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, గ్రామీణ ప్రాంత ప్రజలకు 90 శాతం రుణాలు అందిస్తున్న గ్రామీణ బ్యాంకులపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.