న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కారించాలంటూ బ్యాంకు యూనియన్లు శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెను చేపడుతున్నాయి. శని, ఆదివారాలతోపాటు సోమవారం వినాయక చవితి కావటంతో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నది. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా పలు డిమాండ్లపై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఈ నెల 11 దేశవ్యాప్త సమ్మె నిర్వహించనుండటంతో తమ బ్యాంకు శాఖలు మూతపడనున్నాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
నగదు అవసరాల కోసం ఏటీఎంలు, డిపాజిట్ వెండింగ్ మెషిన్లను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించింది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ఉద్యోగులకు చెల్లించే ప్రోత్సాహకాలను సమీక్షించాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలన్న డిమాండ్లతో యూఎఫ్బీయూ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మరోసారి సమ్మె చేస్తామని తెలిపింది. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంకు యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.