బెంగళూరు: సుమారు 15 ఏండ్లు హిందువుగా అందరినీ నమ్మించిన బంగ్లాదేశ్ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు మూడు నెలలపాటు వెతికిన పోలీసులు చివరకు 27 ఏండ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన రోనీ బేగం, 12 ఏండ్ల వయసులో భారత్లోకి అక్రమంగా ప్రవేశించింది. పాయల్ ఘోష్గా పేరు మార్చుకున్నది. పశ్చిమ బెంగాల్కు చెందిన యువతిగా పేర్కొంటూ కొంతకాలం ముంబైలోని బార్లో డ్యాన్సర్గా పనిచేసింది. ఈ సమయంలో మంగళూరుకు చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ నితిన్ కుమార్ను ప్రేమించి పెండ్లి చేసుకున్నది.
పెండ్లి తర్వాత ఈ జంట 2019లో బెంగళూరులోని అంజననగర్లో స్థిరపడింది. హిందువుగా చెప్పుకుంటున్న ఆ మహిళ టైలర్గా పనిచేస్తున్నది. కాగా, ముంబైలో ఉన్న సమయంలోనే ఈ జంట పాన్ కార్డులను సమకూర్చుకున్నది. తర్వాత బెంగళూరులోని నితిన్ స్నేహితుడి సహాయంతో ఆధార్ కార్డులు పొందారు.
అయితే, రోనీ బేగం తండ్రి మూడు నెలల కిందట మరణించారు. దీంతో తండ్రిని కడసారి చూసేందుకు, అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ వెళ్లాలని ఆమె భావించింది. దీని కోసం తొలుత కోల్కతా వెళ్లింది. అక్కడి నుంచి ఢాకా వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె పాస్పోర్ట్పై ఇమిగ్రేషన్ అధికారులకు అనుమానం కలిగింది. ఆ మహిళను ప్రశ్నించగా అక్రమంగా భారత్కు వలసవచ్చినట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ వెంటనే బెంగళూరుకు తిరిగి వచ్చింది.
మరోవైపు, విదేశీ ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) నుంచి ఆ మహిళ సమాచారం బెంగళూరు పోలీసులకు అందింది. దీంతో బ్యాదరహళ్లి పోలీసులు అక్రమ చొరబాటు కింద కేసు నమోదు చేశారు. మూడు నెలలుగా ఆ మహిళ కోసం వెతికారు. చివరకు బెంగళూరు శివారులో ఉంటున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఆమె భర్త నితిన్ పరారీలో ఉన్నాడు.
కాగా, అక్రమంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు పొందేందుకు ఈ జంటకు సహకరించిన వ్యక్తులను గుర్తించేందుకు బెంగళూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ మహిళ అక్రమ వలసకు సహకరించిన నిందితులను అరెస్ట్ చేసేందుకు కోల్కతా, ముంబైతోపాటు ఇతర నగరాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.