న్యూఢిల్లీ, జూన్ 12: జమ్ముకు చెందిన బాబా డానిష్ లాంగర్కు 2017లో పక్షవాతం వచ్చింది. కనీసం సరిగ్గా నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అయినా కూడా ఆర్మీలో చేరాలన్న చిన్ననాటి కల తనను వెంటాడుతూనే ఉన్నది. అందుకే ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమించాడు.. ఎన్నో సమస్యలను అధిగమించాడు.. పక్షవాతాన్నీ గెలిచాడు.. చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు ఎంతో మంది యువకులను ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉత్తరాఖండ్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవల ఆర్మీ అధికారిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. దీంతో డానిష్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన సంకల్ప బలం, లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆశతో ఆరు నెలల్లోనే వ్యాధిని జయించాడని అతడి తండ్రి రాజేశ్ లాంగర్ చెబుతున్నారు.