బాలాసోర్: ‘నీవు ఇక్కడ చదువు కొనసాగించాలంటే నాకు లైంగిక ప్రయోజనాలు కల్పించాల్సిందే ’ అని డిమాండ్ చేస్తూ వేధించడమే కాక, అలా చేయకపోతే నీ భవిష్యత్తును నాశనం చేస్తానంటూ విభాగాధిపతి (HOD) అధ్యాపకుడు చేస్తున్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బీఈడీ విద్యార్థిని (B.Ed Student) మృతిచెందింది. ఒడిశాలోని బాలాసోర్లో (Balasore) తాను చదువుతున్న కాలేజీ ఆవరణలోనే ఈ నెల 12న యువతి నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం రాత్రి మరణించింది.
20 ఏండ్ల బాధిత యువతి బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ చదువుతున్నది. ఆమెను తన లైంగిక వాంఛలు తీర్చాలంటూ హెచ్వోడీ సమీర్ కుమార్ సాహూ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు ఈ నెల 1న అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వారం రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆమె ఆశించింది. అయితే కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు, మిగతా విద్యార్థులు శనివారం (ఈనెల 12న) కాలేజీ గేట్ ముందు ఆందోళన నిర్వహించారు. హఠాత్తుగా బాధిత మహిళ.. ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు పరుగున వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. తోటి విద్యార్థులు వారిని దవాఖానకు భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. అయితే బాధితురాలి శరీరం 95 శాతం గాయపడటంతో సోమవారం రాత్రి 11.46 గంటలకు మరణించింది.