లక్నో : సమాజ్వాది పార్టీ నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ శుక్రవారం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాంపూర్ సరిహద్దుల వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో సహా భారీ సంఖ్యలో మద్దతుదారులు అజంఖాన్ ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆజంఖాన్కు వ్యతిరేకంగా 85 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బెయిల్ రావడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది.
గత వారం హైకోర్టు నుంచి ఎనిమీ ప్రాపర్టీ కేసులో బెయిల్, గురువారం సుప్రీంకోర్టు నుంచి రాంపూర్ పబ్లిక్ స్కూల్ కేసులో మధ్యంతర బెయిల్ నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యారు. ఆజంఖాన్ విడుదల సందర్భంగా జైలు వద్ద ఆజంఖాన్ కుమారులు అదీబ్, అబ్దుల్లా ఆజంతో పాటు శివపాల్ సింగ్ యాదవ్ సీతాపూర్ జైలు వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆయనతో కలిసి రాంపూర్కు బయలుదేరారు. ఆజం ఖాన్ కాన్వాయ్ మధ్యాహ్నం మిలాక్కు చేరుకోగా.. అక్కడ ఎస్పీ కార్యకర్తలు, మద్దతుదారులు పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు.