న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళయిన నేపథ్యంలో సంబరాలకు దేశం సర్వసన్నద్ధమవుతున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను ఘనంగా చాటేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా 750 మంది బాలికలు కలిసి రూపొందించిన 75 పేలోడ్స్తో కూడిన ఆజాదీశాట్ను ఆగస్ట్ 7న లాంచ్ చేయనున్నది. తక్కువ బరువున్న పేలోడ్స్ ప్రయోగం కోసం ఇస్రో అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (SSLV)ను తొలిసారి ప్రయోగించనున్నది. దీని ద్వారా ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 75 పేలోడ్స్ కలిగిన ఆజాదీశాట్ను నింగిలోకి పంపనున్నది.
కాగా, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM)లో గ్రామీణ ప్రాంత బాలికలను ప్రోత్సాహించేందుకు ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ ఆజాదీశాట్. ఎనిమిది కిలోల బరువున్న క్యూబ్శాట్ను వారు రూపొందించారు. ఇందులో వేర్వేరుగా 50 గ్రామల బరువున్న 75 పేలోడ్లున్నాయి. వీటిని రూపొందించేందుకు దేశ వ్యాప్తంగా 750 మంది బాలికలకు ఇస్రో గైడ్లైన్స్ ఇచ్చింది.
‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ పేరుతో ఈ విద్యార్థి బృందాన్ని ఏకీకృతం చేసింది.
మరోవైపు 75 పేలోడ్స్ కలిగిన ఆజాదీశాట్ ఫెమ్టో ప్రయోగాలు నిర్వహిస్తుంది. ఇందులో హామ్ రేడియో ఫ్రీక్వెన్సీతో పని చేసే UHF-VHF ట్రాన్స్పాండర్తోపాటు సెల్ఫీ కెమెరా కూడా ఉంది. కక్ష్యలో అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను కొలిచేందుకు సాలిడ్-స్టేట్ PIN డయోడ్ ఆధారిత రేడియేషన్ కౌంటర్, దీర్ఘ శ్రేణి ట్రాన్స్పాండర్ను కూడా కలిగి ఉంది. టెలిమెట్రీ, కక్ష్యలోని పేలోడ్లతో కమ్యూనికేషన్ కోసం స్పేస్ కిడ్జ్ ఇండియా అభివృద్ధి చేసిన గ్రౌండ్ సిస్టమ్ను ఇస్రో ఉపయోగిస్తుంది.
కాగా, ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి థీమ్ ‘విమెన్ ఇన్ స్పేస్’. ఈ నేపథ్యంలో ‘ఆజాదీశాట్’ ఉపగ్రహాన్ని పూర్తిగా మహిళలే అభివృద్ధి చేశారని స్పేస్ కిడ్జ్ ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రిఫత్ షరూక్ తెలిపారు.