అయోధ్య: అయోధ్య రామ మందిరం విరాళాల్లో అవతకతవకల కేసులో రోజుకో కొత్త కోణం బయటకొస్తోంది. సిట్ నివేదిక ప్రకారం నిందితులు డబ్బులు, కానుకలు ఎలా దొంగిలించారో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విరాళాలను లెక్కించే సిబ్బందిలో ఒకరు సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడగా.. మరొకరు డబ్బులను దొంగిలించి తన లోపలి దుస్తుల్లో దాచుకున్నాడని.. ఇలా కోట్లాది రూపాయలు మిస్ అయినట్టు సిట్ నివేదికలో వెల్లడైంది. అధికారులు జాతీయ మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. విరాళాల బ్యాంకు వివరాలను సమీక్షించినప్పుడు ట్రస్టు అధికారులకు అనుమానం వచ్చింది.
సాధారణంగా ఒక విరాళాల పెట్టెలో రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటాయి. అయితే కొన్ని పెట్టెల్లో మాత్రం రూ.500 నోట్ల కట్టలు తక్కువగా ఉండటాన్ని అధికారులు గమనించి లెక్కింపు గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక వ్యక్తి సీసీ కెమెరాలకు కొన్ని వారాల పాటు అడ్డంగా నిలబడటం అధికారులు గుర్తించారు. అలా నిలబడ్డప్పుడు మరో ఉద్యోగి డబ్బులను తన దుస్తుల్లో దాచుకునేవాడు. ఇలా కోట్ల రూపాయలు దోచేశారు.
కేవలం లెక్కింపు గదిలోనే కాకుండా ఇంకో విధంగా కూడా విరాళాలు పక్కదారి పట్టినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. కౌంటింగ్ స్టాఫ్ నోట్ల కట్టల్లో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ నోట్లను చొప్పించేవారు. బ్యాంకులకు తరలించే క్రమంలోనే సిబ్బంది ఆ కట్టల నుంచి ఎక్కువగా ఉన్న నోట్లను తీసుకునేవారు. అప్పుడు వోచర్లకు సరిపడా మొత్తం బ్యాంకులో జమ అయ్యేది.