ముంబై, ఆగస్టు 6: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు సామాజిక మాధ్యమంలో మద్దతు పలికినందుకు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది. కజ్రత్ పట్టణంలోని అక్కబాయి చౌక్ వద్ద ప్రతీక్ అనే వ్యక్తి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్నాడు.
అక్కడికి చేరుకున్న ఓ వర్గం యువకులు కొందరు కత్తులు, కొడవళ్లు, హాకీ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. నూపుర్ శర్మకు మద్దతుగా ఇన్స్టాగ్రాంలో స్టేటస్ పెట్టుకున్నాడని, కన్హయ్య లాల్ హత్యకు సంబంధించి కూడా పోస్టు చేశాడని అందుకే కొడుతున్నామంటూ కొందరు యువకులు అరిచినట్టు ప్రతీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.