లక్నో: ఉత్తరప్రదేశ్లో పేరుమోసిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. న్యాయవాది ఉమేశ్పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అసద్, గులాం గత కొన్ని రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. వీరు గురువారం మధ్యాహ్నం ఝాన్సీ వద్ద ఒక బైక్పై మారువేషంలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. వారిద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తమపైకి కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో అసద్, గులాం మృతి చెందాలని పోలీసులు ప్రకటించారు.
పోలీసులు మొత్తం 42 రౌండ్ల కాల్పులు జరిపారు. మృతుల నుంచి అధునాతన ఆయుధాలు, సెల్ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్పాల్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ నిందితుడు. ఈ కేసులో సాక్షిగా ఉన్న న్యాయవాది ఉమేశ్పాల్ను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆయన ఇంటి ముందే దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో అసద్ పాలుపంచుకున్నట్టు పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ లభ్యమైంది. అప్పటినుంచి అసద్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అసద్, గులాంపై పోలీసులు రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఉమేశ్పాల్ హత్యతో సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటికే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.