సిమ్లా/డెహ్రాడూన్, ఆగస్టు 20: కుండపోత వర్షాలతో హిమాచల్ప్రదేశ్ అతలాకుతలం అవుతున్నది. ఆకస్మిక వరదలు, కొండచరియల కారణంగా రాష్ట్రంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్, ఒడిశా, జార్ఖండ్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాఖండ్, ఒడిశాలో నలుగురు చొప్పున, జార్ఖండ్లో ఒకరు మృత్యువాతపడ్డారు. శుక్రవారం నుంచి హిమాచల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు సంభవించడంతో 22 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉన్నట్టు తెలిపారు. ఒక్క మండిలోనే 13 మంది మరణించారని పేర్కొన్నారు. కాంగ్రాలోని చక్కి బ్రిడ్జి కొట్టుకుపోయిందని, పఠాన్కోట్, జోగిందర్నగర్మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని వెల్లడించారు. ఇక ఉత్తరాఖండ్లో కుండపోత వానలకు నలుగురు మృతిచెందగా, 10 మంది గల్లంతయ్యారు. చాలా చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. ఇండ్లలోకి వరదనీరు చేరింది. ప్రముఖ శివాలయమైన తాప్కేశ్వర్ గుహల్లోకి వరద నీరు చేరింది.