గువాహతి: అస్సాంలోని మోరాన్, మోటోక్ సామాజిక సంఘాలు 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. ఇటీవల విస్తరించిన మంత్రివర్గంలో తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, అలాగే ఈ రెండు ఆదిమవాసుల వర్గాలకు షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదా కల్పించాలని డిమాండ్ చేశాయి. (Assam’s Shutdown) శుక్రవారం టిన్సుకియా, దిబ్రూగఢ్ జిల్లాల్లో ఆల్ మోరన్ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ అస్సాం మోటోక్ యూత్ స్టూడెంట్స్ అసోసియేషన్, పలు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో 48 గంటల బంద్ ప్రారంభించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని ఆ సంఘాల నేతలు హెచ్చరించారు.
కాగా, నిరసనకారులు పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. టిన్సుకియా జిల్లాలోని రూపాయ్ సైడింగ్-కాకోపతార్ టిని ఆలీ వద్ద ప్రధాన సమావేశం జరిగింది. నిరసనకారులు టైర్లను తగలబెట్టి, వాహనాల రాకపోకలను కొద్దిసేపు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు ఈ రెండు జిల్లాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రవాణా, వాణిజ్య కార్యకలాపాలు, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలు, సాధారణ వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు రెండు జిల్లాల్లోని కీలక ప్రదేశాలలో భద్రతా సిబ్బందిని మోహరించారు.