గౌహతి: అస్సాంకు చెందిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అనుకోకుండా కలుసుకున్నారు. ఒక చోట కలిసి టీ తాగారు. (Rival Assam Candidates Have Tea) అలాగే ప్రార్థనా మందిరంలో కలుసుకున్న వారిద్దరూ ఎన్నికల్లో తమ గెలుపు కోసం దేవుడి ఆశీర్వాదాలు కోరారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ బీజేపీ అభ్యర్థిగా, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) అధ్యక్షుడు లూరింజ్యోతి గొగోయ్, ‘ఇండియా’ బ్లాక్ కూటమి అభ్యర్థిగా దిబ్రూగఢ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
కాగా, ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిద్దరూ ఆదివారం అనూహ్యంగా కలుసుకున్నారు. ఖోవాంగ్లోని హల్దీబారి నఘర్ థాన్ అనే ప్రార్థనా స్థలంలో కలిసి కనిపించారు. సర్బానంద సోనోవాల్, లూరింజ్యోతి గొగోయ్ ఒకే పరుపుపై పక్కపక్కనే కూర్చొన్నారు. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అభినందించుకున్నారు. ఎన్నికల్లో తమ గెలుపు కోసం దేవుడి ఆశీస్సులు కోరారు. అలాగే స్థానికులు ఇచ్చిన టీని వారిద్దరూ తాగారు. సీనియర్, జూనియర్ అయిన వారిద్దరూ గతంలో అస్సాంలోని పురాతన విద్యార్థి సంఘమైన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యూ) అధ్యక్షులుగా ఉన్నారు.