బార్పెట(అస్సాం), ఏప్రిల్ 29: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీపై అస్సాం పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని బార్పెట జిల్లాలోని ఓ స్థానిక కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా పోలీసు అధికారిపై దాడి చేశారన్న ఆరోపణల కేసులో మేవానీకి శుక్రవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసుల వైఖరిని తప్పుబట్టింది. కస్టడీలో ఉన్న ఒక నిందితుడు ఇద్దరు పోలీసు అధికారుల సమక్షంలో మహిళా అధికారిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని పోలీసులు చెబుతున్నారని, అయితే ఎవరూ చూడని ఈ ఘటనను ఎలా పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ చక్రవర్తి ప్రశ్నించారు. ప్రస్తుత కేసులాగే ఫేక్ ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా.. రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిన పోలీసు ఎన్కౌంటర్లను నియంత్రించేలా.. రాష్ట్ర పోలీసు వ్యవస్థ తనను తాను సంస్కరించుకునేలా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారంటూ నమోదైన కేసులో బెయిల్పై విడుదలైన మేవానీని.. మహిళా పోలీసుపై దాడి చేశారని ఆరోపిస్తూ అస్సాం పోలీసులు మళ్లీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పీఎంఓ కుట్రలో భాగంగానే..
బెయిల్పై విడుదలైన అనంతరం మేవానీ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని కార్యాలయం కుట్రలో భాగంగానే తన అరెస్టు జరిగిందన్నారు. ‘నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి వ్యక్తులను అరెస్టు చేయించలేని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ.. నన్ను ఒక ట్వీట్కు సంబంధించి అరెస్టు చేసి గుజరాత్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం జైలుకు తీసుకొస్తారు. దీని ద్వారా ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు’ అని సూటిగా ప్రశ్నించారు.