గౌహతి: ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జూబ్లీ తాములి. వయసు 19 ఏళ్లు. ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఆమె షార్ట్స్ వేసుకొని వచ్చింది. కానీ కాలేజీ అధికారులు మాత్రం అలా షార్ట్స్లో పరీక్ష రాయడం కుదరదు అని తేల్చి చెప్పారు. దీంతో ఆమె చేసేది లేక అక్కడే ఉన్న ఓ పరదాను చుట్టుకొని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ ఘటన అస్సాంలోని సోనిట్పూర్ జిల్లా తేజ్పూర్లో ఉన్న గిరిజానంద చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో జరిగింది.
అసలేం జరిగింది?
ఈ నెల 15న అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించింది. జూబ్లీ తన తండ్రితో కలిసి ఈ ఎగ్జామ్ రాయడానికి బిశ్వనాథ్ చరియాలీ నుంచి వచ్చింది. తాను సెంటర్లోకి అడుగుపెడుతున్నప్పుడు ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, పరీక్ష హాల్లోకి వెళ్లే సమయంలో ఈ సమస్య మొదలైందని జూబ్లీ చెప్పింది. అందరినీ లోనికి పంపినా.. షార్ట్ డ్రెస్లో రాకూడదంటూ తనను అడ్డుకున్నట్లు ఆమె తెలిపింది. ఇలా రావద్దని అడ్మిట్ కార్డ్లో ఎక్కడా లేదు కదా అని ప్రశ్నిస్తే.. ఈ విషయం నీకు తెలియాలి అని సమాధానమిచ్చినట్లు జూబ్లీ వెల్లడించింది.
ఆమెకు ప్యాంట్ తీసుకురావాలని జూబ్లీ తండ్రికి అధికారులు చెప్పారు. అతడు వెంటనే మార్కెట్కు పరుగెత్తినా.. అక్కడే ఉన్న ఇద్దరు యువతులు.. ఓ కర్టెయిన్ చుట్టుకొని వచ్చెయ్ అని చెప్పడంతో ఆమె అలాగే హాల్లోకి వెళ్లి పరీక్ష రాసింది. తన జీవితంలో ఇది అత్యంత అవమానకరమైన అనుభవం అని పరీక్ష తర్వాత జూబ్లీ చెప్పింది. యువతులు ఏం వేసుకోవాలి, ఏం వేసుకోవద్దన్నది కాలేజీ వాళ్లు ఎలా చెబుతారని ప్రశ్నించింది. షార్ట్ డ్రెస్ వేసుకోవడం నేరమా అని అడిగింది.