గౌహతి: అస్సాం సీఎం శరబానంద సోనోవాల్ ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిబ్రూఘర్లోని ఓ పోలింగ్ సెంటర్లో ఆయన ఓటేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వంద కన్నా ఎక్కవ స్థానాల్లో గెలవనున్నట్లు సీఎం శరబానంద సోనోవాల్ తెలిపారు. ఇవాళ ఓటు వేయడానికి ముందు ఆయన డిబ్రూఘర్లో ఉన్న బోగ బాబా మజార్కు వెళ్లిన ప్రార్థనలు చేశారు. అందరి శాంతి కోసం మొక్కుకున్నానని, బీజేపీ గెలవాలని కోరుకున్నట్లు సీఎం తెలిపారు.
మరో వైపు కాంగ్రెస్ గౌరవ్ గగోయ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోర్హట్లో ఆయన ఓటేశారు. ఇవాళ అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు తొలి దశ ఓటింగ్ జరుగుతున్నది. మొత్తం 47 స్థానాల్లో మొదటి దశ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటేసిన తర్వాత గౌరవ్ గగోయ్ మాట్లాడుతూ.. ఇది తనకు భావోద్వేగపూరిత సందర్భమని, మొదటి సారి పేరెంట్స్ లేకుండా పోలింగ్ స్టేషన్కు వచ్చానని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు అబద్దపు రాజకీయాలను ఓడిస్తారన్న నమ్మకం ఉందని, వారికి భవిష్యత్తును ఇచ్చేవారికే ఓటేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.