న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచించింది. (India advises citizens) తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దీనిని పాటించాలని పేర్కొంది. అలాగే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు సమీపంలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. ఇరు దేశాల్లో నివసిస్తున్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, అనవసర కదలికలను నియంత్రించాలని సూచించింది.
కాగా, ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఇరాన్ అగ్రశ్రేణి ఆర్మీ జనరల్, మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై దాడికి సన్నద్ధమవుతున్నది. దీంతో మిడిల్ ఈస్ట్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.