ముంబై : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడి ఆర్యన్ఖాన్కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ సహా ఎనిమిది మంది నిందితులకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 11వ తేదీ వరకు తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరగా.. ఈ అభ్యర్థతనను న్యాయస్థానం తోసిపుచ్చుతూ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినందున నిర్బంధ విచారణ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
‘నిర్ధిష్ట కారణం లేకుండా ఒక నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే’ అని కోర్టు పేర్కొంది. జ్యుడిషియల్ కస్టడీ విధించిన కొద్ది నిమిషాల్లో ఆర్యన్ తరఫు న్యాయవాది రెండు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరుగనున్నది. అయితే, కేసు విచారణ సందర్భంగా ఆర్యన్ తల్లిదండ్రులు షారుక్ఖాన్, గౌరీఖాన్ కోర్టుకు హాజరు కాలేదు.
ఈ నెల 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్ఖాన్, మున్మున్ ధామేచ, అర్బాజ్ మెర్చంట్ సహా ఎనిమిది మంది అరెస్టయిన విషయం తెలిసిందే. వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరుచగా.. దర్యాప్తు కోసం కస్టడీకి ఇవ్వగా.. నేటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో నిందితులను మరోసారి కోర్టులో హాజరుపరుచగా ధర్మాసనం జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. అయితే, జైలుకు బదిలీ చేసే సమయం ముగిసిపోయిన క్రమంలో వీరంతా ఇవాళ ఎన్బీసీ కార్యాలయంలోనే ఉండనున్నారు.