న్యూఢిల్లీ: ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఈ నెలతో ముగియనున్నది. అయితే దీనిని పొడిగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. ‘ఉచిత రేషన్ పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడిగిస్తోంది’ అని హిందీలో ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అవసరమైన ప్రజలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కోరారు. ‘ద్రవ్యోల్బణం చాలా ఎక్కువైంది. సామాన్యులు సైతం రెండు పూటలా తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. కరోనా కారణంగా చాలా మంది నిరుద్యోగులయ్యారు. ప్రధానమంత్రి గారు, దయచేసి పేదలకు ఉచిత రేషన్ ఇచ్చే ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించండి’ అని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు.