న్యూఢిల్లీ : లడఖ్ సెక్టార్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే దీటుగా స్పందించేందుకు సన్నద్ధంగా ఉన్నామని భారత సైన్యం స్పష్టం చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పెట్రోలింగ్తో పాటు పలు చర్యలు చేపడుతున్నామని దేశ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఎల్ఏసీ వద్ద యథాతథ స్ధితిని మార్చేందుకు చైనా దళాల దూకుడుకు భారత సైన్యం వేగంగా, దీటుగా స్పందించి అడ్డుకట్ట వేసిందని ఆర్మీ నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
ఎల్ఏసీ వద్ద చైనా ఎలాంటి దుందుడుకు చర్యలకు తెగబడినా త్రివిధ దళాల మధ్య సమన్వయంతో మన సాయుధ బలగాలు డ్రాగన్ చర్యలను దీటుగా తిప్పికొడతాయని చెప్పారు. ఎల్ఏసీపై నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు దౌత్య స్ధాయిలో, అధికారుల స్ధాయిలో చేపట్టాల్సిన చర్యలూ కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎల్ఏసీలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లు, ముప్పును పసిగడుతూ ఎదుర్కొనేందుకు నార్తన్ కమాండ్ సంసిద్దంగా ఉందని లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది తెలిపారు. జాతి ప్రజాస్వామిక పునాదులు, సంప్రదాయాలను కాపాడుతూ దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాము నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో పాటు అన్ని పరిణామాలను పసిగడుతూ జాతి ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు.