Anantnag Encounter | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి ముగ్గురు ఆర్మీ అధికారులు బలయ్యారు. దక్షిణ కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని కోకెర్నాగ్ హలురా గండుల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నంది. రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ కల్నల్, మేజర్, జమ్మూ కశ్మీర్ డీఎస్పీ సహా ముగ్గురు అధికారులు వీరమరణం పొందారు. కాల్పుల్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, జమ్మూకశ్మీర్ పోలీస్ డీఎస్పీ హుమాయున్ భట్ తీవ్రంగా గాయపడగా.. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. అధిక రక్తస్రావం కారణంగా భట్ మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కోకెర్నాగ్ హులురా గండుల్ ప్రాంతంలో ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
జాయింట్ బృందానికి అనుమానాస్పద ప్రదేశం కనిపించగా.. అటువైపుగా వెళ్తున్న సమయంలో అప్పటికే అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో ఆర్మీ అధికారి, పోలీస్ అధికారికి తూటాలు తగలడంతో గాయాలయ్యాయి. ఇద్దరిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం సంఘటనా స్థలం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. అయితే, ఉగ్రవాదులకు కదలికలకు సంబంధించిన సమాచారం అందడంతో బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. దిగాడోల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
రాత్రి కావడంతో నిలిపివేశారు. ఉగ్రవాదులు రహస్య ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో బుధవారం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, కల్నల్ మన్ప్రీత్ సింగ్ తన టీమ్ను ముందుండి నడిపిస్తున్న సమయంలో ఆయనపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన గాయపడ్డ ఆయన.. చివరకు వీరమరణం పొందారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఎన్కౌంటర్లో మంగళవారం ఓ ఉగ్రవాదిని, బుధవారం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు జమ్మూ ఏడీజీపీ ముఖేష్ సింగ్ పేర్కొన్నారు.