తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పైన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని సూచించారు.
‘గౌరవ గవర్నర్కు రాజకీయాలపై ఆసక్తి ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి. రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. బీజేపీ టికెట్ తీసుకుని కేరళలోని ఏ స్థానం నుంచి అయినా ఆయన పోటీ చేయొచ్చు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. గవర్నర్ రోజూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చే బదులు సీఎంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే మంచిది’ అని బృందాకారత్ వ్యాఖ్యానించారు.
కాగా, కేరళ సర్కారు పంపిన యూనివర్సిటీ బిల్లులపై సంతకాలు చేయకుండా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పెండింగ్లో పెట్టారు. దాంతో గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఎందుకంటే యూనివర్సిటీ బిల్లులు మనీ బిల్లులు కాబట్టి గవర్నర్ ఆమోదం లేకుండా వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. దాంతో ఆ బిల్లులపై ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతున్నది.