కాట్రా: నూతన సంవత్సరం వేళ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. త్రికూఠ పర్వతంపై ఉన్న కాంప్లెక్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. వైష్ణవదేవీ భవన్కు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నారు. దేవి దర్శనం కోసం అనుమతి పాస్లు లేని భక్తులు కూడా అధిక సంఖ్యలో భవన్కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కిక్కిరిసిపోయిన భక్తుల మధ్య వాగ్వాదం జరిగినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. భవన్లోని మూడవ నెంబర్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వాగ్వాదం తర్వాత భక్తులు ఒకర్ని ఒకరు నెట్టుకోవడం వల్ల.. తొక్కిసలాట జరిగినట్లు దిల్బాగ్ చెప్పారు. 2022 కొత్త సంవత్సరం సందర్భంగా దేవి దర్శనం కోసం అత్యధిక సంఖ్యలో త్రికూఠ పర్వతానికి భక్తులు చేరుకున్నారు. తెల్లవారుజామున 2.45 నిమిషాలకు తొక్కిసలాట జరిగింది.
దర్శనం మళ్లీ ప్రారంభం..
మృతిచెందిన 12 మంది 8 మందిని అధికారులు గుర్తించారు. దీరజ్ కుమార్, శ్వేతా సింగ్, వినయ్ కుమార్, సోనూ పాండే, మమతా, ధరమ్వీర్ సింగ్, వనీత్ కుమార్, అరుణ్ ప్రతాప్ సింగ్లు మరణించినట్లు తెలిపారు. మృతుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల వారే ఉన్నట్లు తెలిపారు. గాయపడ్డవారిని నారాయణ హాస్పిటల్కు తరలించారు. తొక్కిసలాట ఘటన తర్వాత భక్తులను ఖాళీ చేయించేందుకు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉంది. మళ్లీ వైష్ణోదేవి దర్శనం ప్రారంభమైనట్లు అధికారులు చెప్పారు. తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు.
రోజూ వేలాది మంది..
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు పండిట్ సందర్శన్ సందేశం ఇచ్చారు. భక్తుల అందరూ ప్రశాంతంగా ఉండాలన్నారు. ఆలయం వద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి రోజూ వైష్ణోదేవి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. జమ్మూకు సమీపంలో కాట్రా వద్ద పర్వతంపై ఈ ఆలయం ఉన్నది. సుమారు 5200 ఫీట్ల ఎత్తులో ఉన్న ఆలయానికి చేరకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. కాలినడకన లేదా డోలీ లేదా హెలికాప్టర్లో ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ నిర్వహణనను వైష్ణోదేవి ఆలయ బోర్డు చూసుకుంటుంది. త్రికూఠ హిల్స్లో దేవి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు బ్యాటరీ కారు, రోప్వే సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
సీఆర్పీఎఫ్ వల్లే..
వైష్ణవీ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల వల్ల తొక్కిసలాట జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ వీవీఐపీ వస్తున్న సమయంలో.. భక్తుల్ని ఆ మార్గం నుంచి తొలగించేందుకు లాఠీలతో సీఆర్పీఎఫ్ జవాన్లు బెదిరించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల లాఠీ దెబ్బలను తప్పించుకునేందుకు .. ఆలయంలోకి వెళ్తున్న భక్తులు, ఆలయం బయటి నుంచి వస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.