లక్నో, జూలై 22: ఉత్తరప్రదేశ్లోని యోగి క్యాబినెట్లో లుకలుకలు, అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తమ శాఖల్లో తమకు తెలియకుండా జరుగుతున్న ఉద్యోగుల బదిలీలపై మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా తన శాఖలో జరిగిన బదిలీల అంశాన్ని ప్రశ్నిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. నోయిడా అథారిటీలో డిప్యూటేషన్ల తర్వాత జరిగిన బదిలీలు, ప్రమోషన్లు, పోస్టుల విలీనంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే యూపీ జల్శక్తి శాఖ మంత్రి దినేశ్ ఖటిక్ తన శాఖలో జరిగిన పోస్టులు, బదిలీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే గురువారం సీఎం యోగిని కలిసిన తర్వాత వెనక్కు తగ్గారు. అదేవిధంగా తన ఓఎస్డీ బదిలీపై మరో మంత్రి జితిన్ ప్రసాద రగిలిపోతున్నారు. యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ కూడా వెళ్లారు. ఇండా డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్తో సహా పలువురు ఇతర మంత్రులు తన శాఖల్లో తమ ఆమోదం లేకుండా జరుగుతున్న బదిలీలపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తున్నది. బదిలీల్లో అవకతవకల విషయంలో పాథక్ ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శికి లేఖ రాశారు.