శ్రీనగర్: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నిర్ణయించింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా తమ పార్టీ పోటీ చేస్తుందని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తెలిపారు. ‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దాని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీని గురించి ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని అన్నారు.
కాగా, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ నుంచి ఒక్కో పార్టీ తప్పుకుంటున్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన జేడీ(యూ) చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తొలుత యూటర్న్ తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఆయన, ఎన్డీయే మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణం చేయడంతోపాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేశారు.