చిట్యాల, మే 1 : మండలంలోని వెల్మినేడు శివారులోని నోస్ కంపెనీలో మరోసారి భారీ పేలుడు సంభవించి 8 మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. 20 రోజుల్లో ఇది రెండో ఘటన కావడంతో కంపెనీలోని కార్మికులు, సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కంపెనీ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నోస్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. 3వ బ్లాక్లో రియాక్టర్ పేలి పొగలు కమ్ముకున్నాయి. ఆ బ్లాక్లో 9 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. ఈ ఘటనలో వారందరికీ గాయాలుకాగా .. చిన్నకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణ (30) పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని డీఆర్డీఏ అపోలో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
గాయపడినవారిలో శివప్రసాద్, శంకర్, లోకేశ్, లింగస్వామి, డేవిడ్ ఉన్నారు. డేవిడ్ జార్ఖండ్కు చెందిన వ్యక్తి కాగా మిగిలిన వారు తెలంగాణకు చెందినవారు. ఘటనాస్థలాన్ని కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్రపవార్ సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి అయ్యేవరకు కంపెనీలో ఉత్పత్తి నిలిపివేయాలని సూచించారు. కంపెనీలో వరుస ఘటనలపై స్థానికులు ఆందోళన చేపట్టారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. బాధితులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు.