ముంబై: కోర్డెలియా క్రూయిజ్ షిప్లో మరో 143 మంది ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ షిప్లో కరోనా సోకిన వారి సంఖ్య 209కి చేరింది. సోమవారం గోవాకు బయలుదేరిన లగ్జరీ షిప్లో కరోనా కలకలం రేపింది. అందులో రెండు వేల మంది ప్రయాణించారు. గోవా చేరిన ఆ షిప్లో తొలుత 66 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆరుగురు సిబ్బంది తప్ప కరోనా సోకిన వారు అక్కడి వైద్య కేంద్రంలో చేరేందుకు నిరాకరించారు. దీంతో ఆ క్రూయిజ్ను ముంబైకి తిప్పి పంపారు.
మంగళవారం సాయంత్రం ముంబైకి తిరిగి వచ్చిన ఆ ఓడలోని 1,827 మందికి బీఎంసీ సిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. దీంతో మరో 143 మంది పాజిటివ్గా బుధవారం తేలింది. కరోనా సోకిన వారిలో 41 మంది ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా బారిన పడిన వారిని తప్ప మిగతా వారు షిప్ నుంచి వెళ్లేందుకు బీఎంసీ అధికారులు అనుమతించలేదు. దీంతో మరికొంత మంది ప్రయాణికులు ఇంకా క్రూయిజ్లోనే ఉన్నారు. కాగా, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అని బీఎంసీ అధికారులు తెలిపారు.