న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసిన తల్లే ఓ పసిగుడ్డును చిదిమేసింది. పుట్టిన వెంటనే బిడ్డను బాత్రూమ్ కిటికీలోంచి బయటికి విసిరేసింది. ఆ తర్వాత బాత్రూమ్ను శుభ్రం చేసి ఏమీ ఎరుగనట్టుగా ఉన్నది. అయితే, రోడ్డుపై తీవ్ర గాయాలతో పడివున్న బిడ్డను చూసి స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో కన్నతల్లే బిడ్డను భవనంపై నుంచి కిందకు విసిరేసినట్టు తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ విహార్కు చెందిన 20 ఏండ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. నెలలు నిండటంతో సోమవారం సాయంత్రం తమ నివాసంలోని బాత్రూమ్లోనే రహస్యంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, పెండ్లి కాకుండానే బిడ్డకు తల్లి అయినందుకు సమాజంలో నిందను మోయాల్సి వస్తుందని భయపడింది.
దాంతో తన స్వార్థం కోసం నవ మాసాలు కడుపులో మోసిన పసిగుడ్డుపట్ల కర్కషంగా వ్యవహరించింది. సమాజం చీదరింపుల నుంచి బయటపడేందుకు పేగు బంధాన్ని విస్మరించింది. అత్యంత అమానుషంగా జై అంబే అపార్టుమెంటులోని తన నివాసం బాత్రూమ్ నుంచి బిడ్డను బయటికి విసిరేసింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడివున్న పసిబిడ్డను చూసి స్థానికులు చలించిపోయారు.
హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ బిడ్డను పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను గుర్తించేందుకు బిడ్డ పడిపోయిన ప్రదేశంలోని అన్ని భవనాల్లో తనిఖీలు చేశారు. ఓ ఇంటి బాత్రూమ్లో రక్తం మరకలు కనిపించడంతో అనుమానించారు.
ఆ ఇంట్లో వాళ్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో ఆ ఇంట్లోని 20 ఏండ్ల యువతి చేసిన తప్పును ఒప్పుకుంది. పెళ్లి కాకుండానే తల్లి అయితే సమాజం దెప్పి పొడుస్తున్న భయంతో బిడ్డను పొట్టన పెట్టుకున్నానని చెప్తూ విలపించింది. దాంతో పోలీసులు అమెపై సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాధారాలను మాయం చేయడం) ప్రకారం కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు.