న్యూఢిల్లీ: గత 12 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఎప్పుడు రికార్డు చేశారనే వివరాలు లేని ఈ వీడియో సోషల్ మీడియాలో బుధవారం ప్రత్యక్షమైంది. చేతనైతే తనను అరెస్టు చేసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను సవాల్ చేసేలా అందులో మాట్లాడారు. ‘నేను ఇంతకుముందు అరెస్టుకు భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడను’ అని పేర్కొన్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బైసాఖీ రోజున జరిగే సర్బత్ ఖల్సా కార్యక్రమంలో దేశవిదేశాల్లోని సిక్కులందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తుంచుకోవాలని, పంజాబ్ సమస్యలను పరిష్కరించాలంటే సిక్కులు అందరూ కలిసి ఉండాలని అందులో అన్నారు. అయితే అమృత్పాల్ ఇప్పటికే దేశం నుంచి పారిపోయాడని, ఈ వీడియో విదేశాల నుంచి సోర్స్ చేయబడిందని, అంతేకుండా రెండు రోజుల పాతదిగా కనిపిస్తున్నదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. యూకే హ్యాండిల్స్ అమృత్పాల్ వీడియోను పోస్టు చేసివుంటాయని తెలిపాయి.