Amit Shah : ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ము కశ్మీర్లో శాంతి, భద్రతల విషయంలో నూతన శకం ఆరంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో 70 శాతం తగ్గుదల కనిపించిందని పేర్కొన్నారు. అమిత్ షా గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్ములో ఈ-బస్ సర్వీస్ను ప్రారంభించడంతో పాటు వేయి మందికిపైగా జమ్ము కశ్మీర్ ఉమ్మడి పరీక్ష 2024లో నెగ్గిన వారికి నియామక పత్రాలు అందచేశారు.
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పౌరుల మరణాలు 81 శాతం తగ్గగా, భద్రతా దళాల మరణాలు 48 శాతం తగ్గాయని షా పేర్కొన్నారు. 2010లో రాళ్లు రువ్విన ఘటనలు 2654 చోటుచేసుకోగా 2023లో అవి పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పారు.
2010లో 132 సమ్మె ఘటనలు జరగగా, 2023లో అలాంటి ఘటన ఒక్కటి కూడా లేదని తెలిపారు. 2010లో రాళ్ల దాడుల్లో 112 మంది పౌరులు మరణిస్తే 2023లో ఒక్కరూ కూడా చనిపోలేదని చెప్పారు. 2010లో రాళ్ల దాడుల ఘటనల్లో 6235 మందికి గాయాలు కాగా 2023లో అలాంటి ఘటన ఒక్కటి కూడా చోటుచేసుకోలేదని మంత్రి వివరించారు.
Read More :