Hemant Soren | శాసనసభ్యత్వంపై అనర్హత ముప్పు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సరదాగా గడిపారు. శనివారం రాష్ట్ర రాజధాని రాంచీకి 30 కి.మీ. దూరంలోని కుంతి వద్ద గల లాత్రాటు డ్యామ్ సమీపాన చెరువులో బోటుతో షికారు చేశారు. అంతకుముందు మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతోపాటు సొంత జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేలతో మూడో దఫా సుదీర్ఘ మంతనాలు జరిపారు. లాత్రాటు డ్యామ్ సమీపాన చెరువులో బోటుపై షికారు చేసిన హేమంత్ సోరెన్ రాత్రికి రాంచికి తిరిగి రావాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
మూడో దఫా చర్చల్లో దాదాపు 43 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అటుపై బస్సుల్లో రహస్య ప్రాంతానికి బయలుదేరి వెళ్లారని సమాచారం. శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడితే సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అధికార జేఎంఎం, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సోరెన్, తన మిత్రపక్షాల నేతలతో చర్చించారు.
సీఎం హేమంత్ సోరెన్పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేస్తూ జారీ చేసిన ఆదేశాలను జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బాయిస్ శనివారం పంపుతారని సమాచారం. సీఎంగా హేమంత్ సోరెన్.. తన మైనింగ్ సంస్థకే లీజుకిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయనపై అనర్హత వేటు వేసే విషయమై అభిప్రాయం తెలుపాలని గవర్నర్ను కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సంగతి తెలిసిందే.