పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి (Rabri Devi) బీహార్ సీఎం నితీశ్ కుమార్ను హెచ్చరించారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడంపై ఆమె మండిపడ్డారు. బీహార్లో ఆర్జేడీ, బీజేపీ మధ్య మాత్రమే పోరు ఉందని రబ్రీ దేవి అన్నారు. అందుకే ఆర్జేడీ, తమ మిత్రపక్షం కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేల ఫిరాయింపులకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. అయితే దీనికి తాము ఆందోళన చెందడం లేదని అన్నారు. ‘ఒకవేళ ఆందోళన చెందాల్సిన అవసరం ఎవరికైనా ఉందంటే అది నితీష్ కుమార్ మాత్రమే. ఇది గోడపై రాసుకుని ఆయన చూడాలి. అసెంబ్లీలో బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించడం మాత్రం కాదు’ అని ఆమె విమర్శించారు.
కాగా, బలపరీక్ష సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఆర్జేడీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని రబ్రీ దేవి తెలిపారు. వారు చేస్తున్న పనికి సిగ్గుపడాలని విమర్శించారు. పార్టీ మారే ఉద్దేశం ఉన్న ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు సీఎం నితీశ్ కుమార్ వచ్చే వారం విదేశాల్లో పర్యటించడంపై రబ్రీ దేవి స్పందించారు. ‘ఆయనకు మంచి జరుగాలని కోరుకుంటున్నా. ఆయన విదేశాల్లో స్థిరపడవచ్చు. ఇక్కడ ఆయనకు పెద్దగా పనేమీ లేదు’ అని వ్యాఖ్యానించారు.