చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పాటియాలా నుంచి పోటీ చేయనున్నారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ), 22 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. 22 మంది అభ్యర్థులలో, మజా నుంచి ఇద్దరు, దోబా నుంచి ముగ్గురు, మాల్వా ప్రాంతం నుండి 17 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారుడు మహ్మద్ ముస్తఫాపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ఆ వ్యక్తి (ముస్తఫా) కటకటాల వెనుక ఉండాలని అన్నారు. ఆ వీడియోను తాను విన్నానని, పంజాబ్ శాంతికి విఘాతం కలిగించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
కాగా, నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేయడంపై కినుకవహించిన అమరీందర్ సింగ్, పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతరం ఆయన బీజేపీలో చేరవచ్చని ఉహాగానాలు వినిపించాయి. అయితే పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం తమ పార్టీ బీజేపీకి మద్దతిస్తుందని తెలిపారు.