చండీఘఢ్ : కాంగ్రెస్ పార్టీతో తెరవెనుక మంత్రాంగం ప్రసక్తే లేదని కొత్త పార్టీ ఏర్పాటుపై ముందుకెళతామని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. త్వరలోనే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తెరచాటు మంతనాలు సాగుతున్నాయనే వార్తలు అసత్యమని, సోనియా గాంధీ సహకారానికి ధన్యవాదాలని..కానీ తానిప్పుడు ఆ పార్టీలో లేనని అమరీందర్ పేర్కొన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను ఏర్పాటు చేసే కొత్త పార్టీ బీజేపీతో సీట్ల సర్ధుబాటుకు చర్చలు జరుపుతుందని అమరీందర్ వెల్లడించినట్టు ఆయన సన్నిహితుడు రవీన్ తుక్రాల్ తెలిపారు. రైతుల సమస్య పరిష్కారమైన తర్వాత బీజేపీతో పాటు కలిసివచ్చే అకాలీ వర్గాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపాలన్నది కెప్టెన్ ఆలోచనగా రవీన్ వెల్లడించారు.