Amar Jawan Jyoti | గణతంత్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు అమర జవాన్ జ్యోతి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 1971 లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా స్మారకం నిర్మించారు. 1972 జనవరి 26 న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ జ్యోతిని వెలిగించారు. అమర జ్యోతి అంటే సైనికుడి జ్వాల అని అర్ధం. రెండేళ్ల క్రితం విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన 25,942 మంది సైనికులను పేర్లను శిలా ఫలకంపై లిఖించారు. అయితే అప్పుడే దీనిపై విమర్శలు చెలరేగాయి. అయితే దీనిపై సైన్యం వివరణ ఇచ్చింది. చరిత్రకు, ఈ జ్యోతికి విడదీయరాని బంధముందని ఇది ఇలాగే కొనసాగుతుందని సైన్యం ప్రకటించింది.
ఇక.. త్రివిధ దళాల అధిపతులు, అతిథులు కూడా అమర జ్యోతిని సందర్శించి, నివాళులర్పించేవారు. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం లాంటి ముఖ్యమైన రోజుల్లో కూడా త్రివిధ దళాల అధిపతులు అమర జ్యోతి దగ్గరికి వచ్చి నివాళులర్పించేవారు. 2019 లో ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతీయ యుద్ధ స్మారకం ప్రారంభం జరిగింది. 176 కోట్లు, 40 ఎకరాల్లో ఇది వుంటుంది. ఇది ప్రారంభమైన తర్వాత ఇండియా గేట్ వద్ద జరిగే అన్ని సైనిక కార్యక్రమాలను కూడా జాతీయ యుద్ధ స్మారకం వద్దకు మార్చారు.
ఇప్పుడు ఈ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్పేయనుందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా విస్తృతమైన చర్చ జరిగింది. మిశ్రమ స్పందనలు కూడా వ్యక్తమయ్యాయి. మరోవైపు విపక్షాలు కూడా కేంద్రం నిర్ణయంపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఇది చాలా బాధాకరమైన నిర్ణయం అని పేర్కొన్నారు. త్యాగం, దేశభక్తిని కొందరు అర్థం చేసుకోలేరని, కాంగ్రెస్ మరోసారి ఈ జ్యోతిని వెలిగిస్తుందని రాహుల్ ట్వీట్ చేశారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతోందని, ద్రోహానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోజ్ తివారీ కూడా మండిపడ్డారు. అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో కలపడమంటే చరిత్రను తుడిచిపెట్టడమేనని మనోజ్ తివారీ పేర్కొన్నారు.
అమర జవాన్ జ్యోతిని పూర్తిగా ఆర్పేస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. తాము జ్యోతిని ఆర్పేయడం లేదని స్పష్టం చేసింది. అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో కలుపుతున్నామని ప్రకటించింది. మరోవైపు అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేశారు. దీంతో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ సారథ్యంలో, సైనిక లాంఛనాల మధ్యలో ఈ కీలక ఘట్టం పూర్తైంది.