ముంబై: ఎప్పుడూ భార్య చెప్పేదే వినాలని పోలీస్ అధికారి ఒక ట్విట్టర్ యూజర్కు సలహా ఇచ్చారు. తాను కూడా ఇదే పాటిస్తానని అన్నారు. మహారాష్ట్రలోని పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా ఇటీవల ‘లైవ్ విత్ సీపీ పూణే సిటీ’ కార్యక్రమంతో సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. నగరంలోని లా అండ్ ఆర్డర్పై ట్విట్టర్లో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాగా, ధర్మ సందేహాన్ని ఒక వ్యక్తి ఏకరవు పెట్టాడు. తాను ముంబై నుంచి మరో ప్రాంతానికి మారేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. బెంగళూరు వెళ్లాలని తాను ఆలోచిస్తుండగా, తన భార్య పూణేకు మొగ్గు చూపుతున్నదని చెప్పాడు. మీరు ఏం సలహా ఇస్తారు అని సీపీని అడిగాడు. దీంతో అమితాబ్ గుప్తా చిలిపిగా సమాధానమిచ్చారు. రెండూ అందమైన నగరాలని అన్నారు. అయితే ‘ఎప్పుడూ భార్య చెప్పేదే వినాలి’ అని రూల్ బుక్ చెబుతుందన్నారు. ప్రతి ఒక్కరితోపాటు తాను కూడా అదే చేస్తానంటూ బదులిచ్చారు.
అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్, వీధుల్లో అతి తక్కువ పోలీసుల గురించి అడిగిన ప్రశ్నలకు కూడా పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా ఫన్నీగా సమాధానమిచ్చారు. రోడ్డుపై పోలీసులను ప్రతి చోటా చూడకపోవచ్చు, కానీ అవసరమైన వ్యక్తులపై తమకు పూర్తి నియంత్రణ ఉంటుందన్నారు. హెల్మెట్ లేకపోతే రాజైనా ఆసుపత్రి పాలవుతాడని అన్నారు.