ఖార్కీవ్లో ఇరుక్కుపోయిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. సంకట స్థితిలో ఉండిపోయిన వారందరూ తమ వెంట టార్చ్, డబ్బులు, నీళ్లు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించింది. ఈ మూడింటినీ భారతీయులు తమ వెంట కచ్చితంగా ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ కిట్ను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవాలని కోరింది. అంతేకాకుండా పలు సూచనలు కూడా ఇచ్చింది. వైమానిక దాడులు, డ్రోన్ల ద్వారా దాడులు, మిస్సైల్ దాడులు, షెల్లింగ్ దాడులు జరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది. అంతేకాకుండా ఆహార సమస్యలు ఉత్పన్నం కావొచ్చని, శిథిలాలు ఊడి పడొచ్చని, ఉష్ణోగ్రతల్లో మార్పులు రావొచ్చని.. వీటన్నింటి దృష్ట్యా ఈ జాగ్రత్తలను ఖార్కీవ్లో ఉన్న భారతీయులు తీసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.
ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై తాము అన్ని దేశాల ప్రతినిధులతో టచ్లోనే ఉన్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగి వచ్చే విషయంలో ఇప్పటి వరకూ 20 వేల మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అయినా.. మరి కొందరు మిగిలే ఉండిపోయారని ఆయన తెలిపారు. వారు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, ఇప్పటికీ ఖార్కీవ్లో కొన్ని వందల మంది మాత్రమే ఉండిపోయారని తాము ఓ అంచనాకి వచ్చినట్లు వెల్లడించారు.